వైఎస్ జగన్ పాలనతీరుపై చంద్రబాబు ఫైర్

వైఎస్ జగన్ పాలనతీరుపై చంద్రబాబు ఫైర్

వరంగల్ టైమ్స్, చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడారు. చట్టవిరుద్ధంగా తమ వాహనాన్ని పోలీస్‌స్టేషన్‌లో పెట్టారని విరుచుకుపడ్డారు. తమ వాహనాన్ని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు.వైఎస్ జగన్ పాలనతీరుపై చంద్రబాబు ఫైర్జగన్‌లో భయం పుట్టుకొచ్చిందని ఎద్దేవా చేశారు. ఓటమి భయంతో తప్పుడు కేసులు పెట్టి అడ్డుకుంటున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోలీసులు ముందుకు రావాలన్నారు. తప్పు ఎవరు చేసినా సరిదిద్దుకోవాలని సూచించారు. తెలుగుజాతి కోసం త్యాగాలు చేసిన పార్టీ టీడీపీ అని చెప్పుకొచ్చారు. 5 కోట్ల మంది బాధపడుతుంటే శాడిస్ట్ సీఎం ఆనందపడతారని వ్యాఖ్యలు చేశారు. చట్టాన్ని అతిక్రమిస్తే ఎవరైనా నేరస్తులే అని, డీఎస్పీ ప్రజలకు సర్వెంటా లేదా వైసీపీకా అని బాబు ప్రశ్నించారు.

రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. జడ్జీలపైనే అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తపై పోలీసులు అక్రమ కేసులు పెడితే, తాము కూడా పోలీసులపై ప్రైవేట్ కేసులు పెడతామన్నారు. కుటుంబాలు ఎలా బాధపడతాయో పోలీసులకు తెలియజేస్తామని తెలిపారు. పోలీసులు ఆలోచించాలి.. 5 కోట్ల మందికి సహకరిస్తారా.. శాడిస్ట్ సీఎం పక్కన ఉంటారా అని ప్రశ్నించారు. ఏపీలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందన్నారు. సీఎం జగన్‌ పనైపోయిందని.. ఇంటికి పోతారని అన్నారు. జగన్‌కు ఓటు వేసినందుకు ప్రజలు బాధపడుతున్నారని టీడీపీ చీఫ్ తెలిపారు.

కుప్పంలో ప్రభుత్వం రౌడీల రాజ్యం తేవాలని చూస్తోందని అన్నారు. రౌడీ రాజ్యాన్ని అణచివేస్తామన్నారు. శాంతిభద్రతలు కాపాడని పోలీసులు ఖాకీ బట్టలు వేసుకున్న నేరస్తులని వ్యాఖ్యానించారు. జగన్‌ ప్రభుత్వంలో డ్రగ్స్‌కు ఏపీ రాజధాని అయిందన్నారు. “జగన్‌ ఖబడ్దార్‌ గుర్తుపెట్టుకో.. ఇసుక మైనింగ్‌లో నీకు రూ.50 కోట్ల కప్పం కట్టాలా?. గౌరవ సభ అసెంబ్లీని కౌరవ సభగా మార్చారు. తిరిగి గౌరవ సభగా మారినప్పుడే అసెంబ్లీలో అడుగుపెడతా. రాష్ట్రంలో రెండే ప్రత్యామ్నాయాలు… జగన్‌కు భయపడి బతకడం లేదా.. తప్పులను ఎదిరించి నాలుగు రోజులు జైల్లో ఉండి రావడం” అంటూ చంద్రబాబు హెచ్చరించారు.

పిల్లి ఏ రంగులో ఉందన్నది ముఖ్యం కాదు. ఎలుకలను సమర్థంగా పడుతుందా లేదా అన్నది ముఖ్యమని ఎద్దేవా చేశారు. ఐటీ రంగంలో ఏపీని ప్రపంచానికే అగ్రగామిగా నిలపాలనుకున్నానని, మూడున్నరేళ్లలో బీహార్‌ కంటే ఏపీ వెనక్కి వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో ఎవరికీ రక్షణ లేదన్నారు. నిందితులపై కాకుండా, బాధితులపైనే కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సైకోలు బ్రిటిష్‌ కాలంలో ఉన్నారు.. ఇప్పుడూ ఉంటున్నారని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.