దళిత బంధును పక్కాగా అమలు చేయాలి: సత్యవతి

దళిత బంధును పక్కాగా అమలు చేయాలి: సత్యవతిమహబూబాబాద్ జిల్లా : దళితబంధు అమలుపై పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శుక్రవారం దళిత బంధు అమలుపై మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి అధ్యక్షతన జిల్లా స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సన్నాహక సమావేశానికి ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవిందర్ రావు, వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, కలెక్టర్ శశాంక, దళిత బంధు స్పెషల్ ఆఫీసర్ సన్యాసయ్య, జిల్లా ఇతర అధికారులు , స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

సీఎం కేసీఆర్ మానస పుత్రిక దళిత బంధు పథకం అని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. దళిత కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు, సమాజంలో అందరితో సమానాంగా వారు వృద్ధిలోకి రావాలని సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని తెచ్చారని పేర్కొన్నారు. ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా హుజురాబాద్ లో చేపట్టి విజయవంతం చేశామని గుర్తు చేశారు. అనంతరం ఇప్పుడు ప్రతీ నియోజకవర్గంలో 100 మందికి లబద్ధి చేకూర్చాలని, మార్చి 5లోపు వీరిని గ్రౌండింగ్ చేయాలనేది సీఎం కేసీఆర్ ఆలోచన అన్నారు.

ప్రస్తుతం తక్కువ మంది దళిత కుటుంబాలు ఉన్న గ్రామాలు గుర్తించి, అక్కడి దళిత కుటుంబాలు అన్నిటినీ పూర్తిస్థాయిలో ఎంపిక చేయాలని మంత్రి సూచించారు. అలాగే వ్యవసాయం చేసే దళితులకు ఏమైనా సాయం చేయగలమా, అసైన్డ్ భూములు ఉంటే వాటి అభివృద్ధికి సాయం చేయడంపై ఆలోచించాలన్నారు. కోళ్లఫారాలు, పాలు, బర్రెలు, వంటి వాటి గురించి ఆలోచించాలన్నారు. ఏయే గ్రామాలలో ఎస్సీలు ఎక్కువగా ఉన్నారు, ఆ గ్రామాల జాబితా సిద్ధం చేసుకోవాలని తెలిపారు. ఈ పథకంపై ప్రజలకు ఉన్న అనుమానాను నివృత్తి చేయాలని అధికారులకు మంత్రి సూచించారు.