రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మహిళలు మృతి

రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మహిళలు మృతిబెంగళూర్ : తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా మంజుకొండపల్లి-తప్పకులి రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ అదుపుతప్పి ట్రాలీతో సహా పల్టీకొట్టింది. దీంతో ఐదుగురు మహిళలు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. కర్ణాటకలోని రామనగర జిల్లా కనకాపురం తాలూకా కొరలాల్ చంద్ర గ్రామానికి చెందిన 25 మంది మహిళలు తమిళనాడులోని యాంచెట్టి జిల్లా తప్పకులి గ్రామంలో ఆలయాన్ని సందర్శించుకునేందుకు ట్రాక్టర్ లో బయల్దేరారు. అయితే తప్పకులి శివారుకు చేరుకోగానే ట్రాక్టర్ యాగ్జిల్ రాడ్డు విరిగిపోవడాన్ని డ్రైవర్ గుర్తించకపోవడం వల్లే ట్రాక్టర్ అదుపుతప్పి ట్రాలీని ఢీకొట్టడంతో రోడ్డు దిగువున ట్రాక్టర్ పల్టీలు కొట్టింది. దీంతో ట్రాక్టర్ లో ప్రయాణిస్తున్న ఐదుగురు తీవ్రంగా గాయపడి ఘటనా స్థలంలో ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది గాయపడినట్లు యాంచెట్టి పోలీసులు తెలిపారు. స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం యాంచెట్టి, హోసూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా వుండటంతో బెంగళూర్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై యాంచెట్టి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.