ఇజ్రాయెల్ లో కొత్త వేరియంట్ కలకలం

ఇజ్రాయెల్ లో కొత్త వేరియంట్ కలకలం

వరంగల్ టైమ్స్, జెరూసలెం : ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి కలకలం రేపుతున్నది. తాజాగా ఇజ్రాయెల్ లో కొత్త వేరియంట్ ను గుర్తించారు. బెన్ గురియన్ విమానాశ్రయానికి చేరిన ఇద్దరు ప్రయాణికులకు పీసీఆర్ టెస్ట్ నిర్వహించగా కొత్త వేరియంట్ సంగతి తెలిసిందని ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వశాఖ బుధవారం తెలిపింది. ఒమిక్రాన్ కు చెందిన రెండు ఉప వేరియంట్ లు బీఏ 1, బీఏ2 ను కొత్త వేరియంట్ కల్గి ఉన్నట్లు పేర్కొంది. రెండు స్ట్రెయిన్ లు కల్గిన కొత్త వేరియంట్ సోకిన ఇద్దరు వ్యక్తులకు జ్వరం, తలనొప్పి, కండరాల బలహీనత వంటి తేలికపాటి లక్షణాలున్నట్లు వివరించింది.ఇజ్రాయెల్ లో కొత్త వేరియంట్ కలకలంఈ కొత్త వేరియంట్ గురించి ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు తెలియదని ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. కాగా, రెండు వేరియంట్ల కరోనా గురించి తెలిసిందేనని, ఈ కొత్త వేరియంట్ వల్ల ముప్పు ఉండకపోవచ్చని ఇజ్రాయెల్ కరోనా ప్రతిస్పందన చీఫ్ సల్మాన్ జర్కా తెలిపారు. ఈ నేపథ్యంలో దీని వ్యాప్తి, కేసుల గురించి ఆందోళన చెందడం లేదన్నారు. కొత్త వేరియంట్ సోకిన ఇద్దరు రోగులకు ప్రత్యేక చికిత్స కూడా అవసరం లేదని అభిప్రాయపడ్డారు. మరో వైపు ఇజ్రాయెల్ లోని సుమారు 92 లక్షల మంది ప్రజలు ఇప్పటికే కరోనా టీకా మూడు డోసులు పొందారు.