ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు నోటిఫికేషన్

జనవరి 5 నుండి 11 వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు
వెల్లడించిన కాళోజి హెల్త్ యూనివర్సిటీ

ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు నోటిఫికేషన్వరంగల్ జిల్లా : రాష్ట్రంలో వైద్య దంత ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం అయింది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాలకై ఆన్లైన్ దరఖాస్తుల నమోదుకు కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నేడు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా యూనివర్సిటీ పరిధిలోని ప్రుభుత్వ ప్రైవేటు కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్లను భర్తీ చేయనున్నారు. జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్ 2021లో అర్హత సాధించిన అభ్యర్థులు నమోదు చేసుకోవాలని తెలిపారు.

జనవరి 5 ఉదయం 8 గంటల నుండి జనవరి 11న సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వారు సూచించారు. నిర్ధేశిత ధరఖాస్తు పూర్తి చేయడంతో పాటు అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు. ఆన్‌లైన్ లో సమర్పించిన దరఖాస్తులు , సర్టిఫికెట్లను యూనివర్సిటీ పరిశీలించిన అనంతరం తుది మెరిట్ జాబితాను విడుదల చేయనున్నట్లు తెలిపారు.

మెరిట్ జాబితా విడుదల అనంతరం వెబ్ ఆప్షన్లకు యూనివర్సిటీ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. తదనుగుణంగా అభ్యర్థులు ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్లు నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రవేశాలకు సంబంధించి అర్హత ఇతర సమాచారానికి యూనివర్సిటీ వెబ్ సైట్ www.knruhs.telangana.gov.in లో సందర్శించాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.