5వ సారి అండర్19 వరల్డ్ కప్ గెలుచుకున్న ఇండియా

5వ సారి అండర్19 వరల్డ్ కప్ గెలుచుకున్న ఇండియావరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్: శనివారం వివియన్ రిచర్డ్స్ స్టేడియం వేదికగా జరిగిన టైటిల్ ఫైట్ లో ఇంగ్లండ్ పై గెలిచి..అండర్ -19 వరల్డ్ కప్ 2022 విజేతగా టీమిండియా నిలిచింది. ఇంగ్లండ్ తో జరిగిన ఫైనల్ లో 190 రన్స్ లక్ష్యాన్ని ఇండియా మరో 2 బంతులు మిగిలి ఉండగా చేధించింది. అండర్-19 వరల్డ్ కప్ ను భారత్ గెలుచుకోవడం ఇది 5వ సారి. భారత్ బ్యాటింగ్ లో నిషాంత్ సింధు 50 రన్స్ తో నాటౌట్ గా నిలిచి విక్టరీలో కీలక పాత్ర పోషించాడు. వైస్ కెప్టెన్ షేక్ రషీద్ సరిగ్గా 50 రన్స్ చేసి ఔటయ్యాడు. రాజ్ బవా 35 రన్స్ తో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ సేల్స్ , బోయ్ డెన్, అస్పిన్ వాల్ తలా 2 వికెట్లు తీశారు.

అంతకుముందు టీమిండియా పేసర్లు రాజ్ బవా ( 5/31), రవికుమార్ (4/34) ల ధాటికి ఇంగ్లండ్ జట్టు 44.5 ఓవర్లలో 189 రన్స్ కి ఆలౌటైంది. బ్యాటర్ జేమ్స్ రూ ( 116 బంతుల్లో 95 ; 12 ఫోర్లు ) అద్భుతమైన ఆటతో ఇంగ్లండ్ ను ఆదుకున్నాడు. టెయిలెండర్ జేమ్స్ సేల్స్ ( 31)తో కలిసి 8వ వికెట్ కు 93 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన బ్యాటర్ జేమ్స్ రూ 5 పరుగుల తేడాతో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఇక అండర్-19 వరల్డ్ కప్ లో కెప్టెన్ యశ్ ధూల్ కెప్టెన్సీలో టీంఇండియా కుర్రాళ్లు దుమ్మురేపారు. కరేబియన్ గడ్డపై ఆల్ రౌండ్ షోతో భారత టీం అదరగొట్టింది. అండర్ -19 వరల్డ్ కప్ లో 5వ సారి చాంపియన్ గా నిలిచింది భారత్.