మాజీ కమిషనర్ లవన్నకు వారెంట్ జారీ 

మాజీ కమిషనర్ లవన్నకు వారెంట్ జారీ 

వరంగల్ టైమ్స్, కడప జిల్లా : కడప మాజీ మున్సిపల్ కమిషనర్ లవన్న కోర్టుకు రావాలని హైకోర్టు ఆదేశించింది. వృద్ధురాలు పద్మావతి ఇల్లు కూల్చివేతపై హై కోర్టు స్టే విధించినప్పటికీ, అధికారులు కోర్టు ఉత్తర్వులు పాటించకుండా తిరిగి బాధితురాలిపైనే కేసు నమోదు చేశారంటూ ఆమె తరపు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచరాణ చేపట్టిన న్యాయస్థానం కోర్టు ఉత్తర్వులను కొంతమంది అధికారులు గౌరవించకపోవంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వృద్ధురాలి ఇంటిని కూల్చివేయడంపై హైకోర్టు సీరియస్ అయ్యింది.

వైఎస్సార్సీపీ నేత ఇంటి దారి కోసం తన ఇల్లు కూల్చివేస్తున్నారంటూ వృద్ధురాలు పద్మావతి గతంలో హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై కోర్టు స్టే విధించింది. స్టే ఉత్తర్వులను తీసుకెళ్లి ఇస్తే చించేసి ఇళ్లు, షాపులు కూల్చేశారని, పైగా బాధితురాలిపై కేసు నమోదు చేశారంటూ ఆమె తరపు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ కోర్టుకు విన్నవించారు. బాధిత వృద్ధురాలిపై 353 సెక్షన్ కింద కేసు నమోదు చేశారని న్యాయవాది కోర్టుకు విన్నవించారు. న్యాయవాది శ్రావణ్ కుమార్ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేయడంతో నేడు హైకోర్టు విచారణకు స్వీకరించింది.

విచారణ సందర్బంగా బాధితురాలికి నష్టపరిహారం అందిస్తామని ప్రభుత్వం ముందుకొచ్చింది. హైకోర్టు ఉత్తర్వులను ఎందుకు గౌరవించలేదని న్యాయవాది జస్టిస్ సుబ్బారెడ్డి ఈ సందర్భంగా ప్రశ్నించారు. వాదనల సందర్భంగా ఆమెను పోలీసులు రోడ్డుపై ఈడ్చుకు వెళ్తున్న ఫోటోలు, కూల్చివేత దృశ్యాలను న్యాయవాది శ్రావణ్ కోర్టుకు ఇచ్చారు. సీరియస్ అయిన కోర్టు వ్యక్తిగతంగా హాజరు కావాలని అప్పటి మున్సిపల్ కమిషనర్ లవన్నకు వారెంట్ జారీ చేసింది. కేసు విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.