డా.బిఆర్ అంబేద్కర్ కి సీఎం కేసీఆర్ నివాళులు

డా.బిఆర్ అంబేద్కర్ కి సీఎం కేసీఆర్ నివాళులు

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : భారతరత్న, రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 131వ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ సీఎం కేసీఆర్ వారికి నివాళులర్పించారు. అణగారిన వర్గాల సామాజిక, ఆర్థిక సాధికారత కోసం జీవితాంతం పరితపించిన మహానీయుడు అంబేద్కర్ అని సీఎం కొనియాడారు. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా బడుగు, బలహీన వర్గాల హక్కులకు ఎలాంటి అవరోధాలు కలగకూడదనే ఉద్దేశంతో, వారికి కచ్చితమైన భరోసాని, భవిష్యత్తుని ఇచ్చేలా రాజ్యాంగాన్ని రూపొందించిన దార్శనికుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని సీఎం తెలిపారు.డా.బిఆర్ అంబేద్కర్ కి సీఎం కేసీఆర్ నివాళులుఅంబేద్కర్ ఈ దేశంలో జన్మించడం భారతజాతి చేసుకున్న అదృష్టమని సీఎం అన్నారు. ఈ సందర్భంగా దేశ పురోగమనానికి పునాదులు వేసిన అంబేద్కర్ అందించిన సేవలను సీఎం స్మరించుకున్నారు. అంబేద్కర్ స్ఫూర్తితోనే తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలు, వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా వేల కోట్ల రూపాయలతో ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలు, కార్యక్రమాలను రూపొందించి అమలుపరుస్తున్నదని సీఎం తెలిపారు. దళిత సాధికారత కోసం, డా. బి. ఆర్.అంబేడ్కర్ ఆశయ సాధన లో భాగంగా, రాష్ట్ర ప్రభుత్వం దళితుల అభ్యున్నతికి దేశంలోనే ఎక్కడాలేని విధంగా, దళితబంధు పథకం ద్వారా అర్హులైన దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల భారీ మొత్తాన్ని నూటికి నూరు శాతం సబ్సిడీ కింద ఆర్థిక సహాయం అందిస్తున్నదని సీఎం తెలిపారు.

బడుగు బలహీనర్గాల వెనుకబాటుతనాన్ని రూపుమాపేందుకు చదువే శక్తివంతమైన ఆయుధమని భావించిన ప్రభుత్వం అణగారిన వర్గాలకు చెందిన విద్యార్థుల విద్య కోసం కోట్లాది రూపాయలను వెచ్చిస్తున్నదని సీఎం అన్నారు. అత్యున్నత ప్రమాణాలతో ఏర్పాటు చేసిన గురుకులాలు విజయ వంతంగా నడుస్తున్నాయని సీఎం అన్నారు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి ద్వారా విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే ఎస్సీ,ఎస్టీ విద్యార్థుల్లో అర్హులైన వారికి 20 లక్షల రూపాయలను స్కాలర్ షిప్ గా అందిస్తూ, వారి కలలను తెలంగాణ ప్రభుత్వం నిజం చేస్తున్నదని అన్నారు. ఎస్సీ, ఎస్టీల సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అమలుపరుస్తున్న కార్యక్రమాలతో వారి జీవనప్రమాణాలు మెరుగై, ఆత్మగౌరవంతో జీవిస్తున్నారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.