కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని కలిసిన ఎంపీ కావ్య
వరంగల్ టైమ్స్,న్యూఢిల్లీ: మామునూరు ఎయిర్పోర్ట్ ను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య కోరారు. తెలంగాణలో రెండో పెద్ద నగరమైన వరంగల్ కు సమీపంలో నిర్మించనున్న మామునూరు విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడుకి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తో కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మామునూరు విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియ పూర్తయినందున వెంటనే పనులు ప్రారంభించాలని కోరారు.
ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పార్లమెంట్లోని ఆయన ఛాంబర్లో సమావేశమయ్యారు. మామునూరు ఎయిర్పోర్ట్లో కార్గో సేవలతో పాటు మెయింటెనెన్స్, ఓవర్ హాల్ రిపేర్ (ఎంఓఆర్) సదుపాయాలు ఉండేలా చూడాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.జౌళి, ఇతర పరిశ్రమలతో వరంగల్ నగరం పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందుతోందని, వరంగల్కు దగ్గరలో రెండేళ్లకోకసారి ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క – సారలమ్మ జాతర మేడారంలో నిర్వహించడం వంటి ప్రాధాన్యతలను వివరించారు.
మామునూరు ఎయిర్పోర్ట్ పనుల ప్రారంభానికి తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులను అక్కడకు పంపిస్తానని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్ , డాక్టర్ మల్లు రవి, సురేశ్ షెట్కార్ , రామసహాయం రఘురాంరెడ్డి, గడ్డం వంశీకృష్ణతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.














