విద్యార్థులతో కలిసి ప్రార్థన చేసిన స్పీకర్ పోచారం

విద్యార్థులతో కలిసి ప్రార్థన చేసిన స్పీకర్ పోచారం

వరంగల్ టైమ్స్, కామారెడ్డి జిల్లా : విద్య మనిషికి వికాసాన్ని, జ్ఞానాన్ని అందిస్తుందని, నేటి ఆధునిక సమాజంలో ఉన్నత స్థితికి ఎదగడానికి విద్యనే మార్గమని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని నస్రుల్లాబాద్ మండలం నెమలి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ. 60 లక్షలతో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. దీనికంటే ముందు పాఠశాల ప్రార్థన కార్యక్రమంలో స్పీకర్ పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా వరుస క్రమంలో నిలబడి ప్రార్థన చేశారు. దీంతో అందరి దృష్టిని ఆకర్షించారు. విద్యార్థులతో కలిసి ప్రార్థన చేసిన స్పీకర్ పోచారంప్రార్థన ముగిసిన అనంతరం నూతనంగా నిర్మించిన తరగతి గదులను ఆయన ప్రారంభించారు.విద్యార్థులతో కలిసి ప్రార్థన చేసిన స్పీకర్ పోచారంఆ తర్వాత నెమిలి గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ సందర్భంగా ఏర్పాటు చేసిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో స్పీకర్ పాల్గొన్నారు. గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు జరుపుకుంటున్న పూర్వ, ప్రస్తుత విద్యార్థులకు స్పీకర్ అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి స్పీకర్ మాట్లాడారు.

ప్రభుత్వ పాఠశాలల్లో పోటీతత్వం పెరిగిందని, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారని పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ భారీగా నిధులు కేటాయించి అవసరమైన వసతులు, సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గం పరిధిలోని పాఠశాలలలో రూ.22 కోట్లతో 220 అదనపు తరగతి గదుల నిర్మాణానికి స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ ద్వారా నిధులను మంజూరు చేశామన్నారు.

బాన్సువాడ నియోజకవర్గంలోని జూనియర్ కాలేజీలలో అవసరమైన భవనాలు, ఇతర వసతుల నిర్మాణానికి అవసరమైనన్ని నిధులను మంజూరు చేయించామని పేర్కొన్నారు. బాన్సువాడలో బీఎస్సీ నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేయించినట్లు వెల్లడించారు. రూ. 40 కోట్లతో భవనాలు, ఇతర సౌకర్యాలు నిర్మిస్తున్నామన్నారు. పాఠశాలలలో వసతుల మెరుగుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 7300 కోట్లతో మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపారు.

నెమిలి జెడ్పీహెచ్ ఎస్ కు అదనంగా మరో నాలుగు తరగతి గదులను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఎంత ఎత్తుకు ఎదిగిన వారైనా చిన్నప్పుడు పాఠశాలలో విద్యార్థులుగా చదువుకున్నవారేనని, పాఠశాల విద్యే విద్యార్థులకు పునాది అని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.