అమెరికాలో కాల్పుల కలకలం..ఆరుగురు మృతి

అమెరికాలో కాల్పుల కలకలం..ఆరుగురు మృతి

వరంగల్ టైమ్స్, వాషింగ్టన్‌: అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. మిసిసిప్పీ రాష్ట్రంలో శుక్రవారం మూడు వేర్వేరు చోట్ల జరిగిన కాల్పుల ఘటనల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఐతే ఈ మూడు చోట్ల కాల్పులకు పాల్పడింది ఒక్కడే అని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడిని ఇప్పటికే అరెస్టు చేసి విచారిస్తున్నారు. అర్కబుట్ల, టాటె కౌంటీల్లోని ఓ స్టోర్, రెండు ఇళ్లలో కాల్పులు జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుడ్ని రిచర్ డేల్ క్రమ్(52)గా గుర్తించారు.

అయితే ఇతను మొదట తన మాజీ భార్య, ఇతర కుటుంబ సభ్యులపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత తనకు కాబోయే భార్యను కాల్చి చంపినట్లు సమాచారం. అంతకు ముందే ఓ స్టోర్‌లోనూ తుపాకీతో దాడి చేశాడు. ఈ ఘటనల్లో మొత్తం ఆరుగురు చనిపోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అతను ఎందుకు ఈ దాడులు చేశాడో ఇంకా తెలియదని పోలీసులు తెలిపారు. అతడిని విచారించాక పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు.