నేటి కార్మిక జాతీయ సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి
వరంగల్ టైమ్స్, హనుమకొండ: ఫిబ్రవరి 12 గురువారం జాతీయ వ్యాప్తంగా కార్మిక వర్గం పిలుపునిచ్చిన సమ్మెకు మద్దతుగా ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ అన్ని కార్మిక సంఘాలతో కలిపి బుధవారం రోజున వేయి స్తంభాల దేవాలయం నుంచి కాజీపేట రైల్వే స్టేషన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాజీపేట రైల్వే స్టేషన్ వద్ద దాస్యం వినయ్ భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ రేపటి జాతీయ సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని అన్ని కార్మిక సంఘాలకు పిలుపునిచ్చారు. వ్యాపార సముదాయాలు, ఫ్యాక్టరీలు, కార్మికులు, ఉద్యోగులు స్వచ్ఛందంగా బంద్ పాటించి, సమ్మెలో పాల్గొనాలని కోరారు.
కేంద్రంలోని బీజేపీ మోదీ సర్కారు 12 ఏళ్లలో కార్మిక లోకానికి మేలు చేయకపోగా, పూర్తిగా కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని విమర్శించారు. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికుల హక్కులను కాలరాయాలని కేంద్రం యోచిస్తోందని తెలిపారు. కార్మికులకు పని తగ్గ వేతనం, వేతనం కోసం ఉద్యమం, ఉద్యమించేందుకు యూనియన్లు ఉండకుండా చేయాలనే కుట్రలను కేంద్రం నూతన కార్మిక చట్టాల రూపంలో తీసుకొచ్చిందని వివరించారు. కార్మికులందరు హక్కులు సాధించుకునేందుకు ఐక్యంగా ఉద్యమించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీఆర్టీయూ హనుమకొండ జిల్లా కన్వినర్ నాయిని రవి, నాయకులు కాటపూర్ రాజు, రఘు, అరుణ్ కుమార్, రవి, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి రాగుల రమేష్, ఉప్పలయ్య, చక్రపాణి, కారు ఉపేందర్, ఏఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు సారంగపాణి, రాజు గౌడ్, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు రాజేందర్, ఏఐసీటీయూ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస రావు, ఎంఏటీఏడీయూ అధ్యక్షులు ఈసంపెల్లి సంజీవ, శ్రీధర్ రెడ్డి, బాబు, జయరాం, పేయింటర్ సంఘం జిల్లా అధ్యక్షులు రాజారపు రాజు, చిరు వ్యాపారుల సంఘం ఎండీ ఇస్మాయిల్, టీబీఎస్ఆర్కే పీ శివకుమార్, భిక్షపతి, రాజు, జీడబ్ల్యూఎంసీ భిక్షపతి, ధర్మరాజు, రామ్మూర్తి, ప్రతాప రుద్ర ఆటో యూనియన్ నర్సింగ్, హోటల్ వర్కర్స్ యూనియన్ ఆల్ఫా, గౌరవ అధ్యక్షులు బాబు రావు, తదితరులు పాల్గొన్నారు.














