హైదరాబాద్: హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. జీహెచ్ఎంసీలో మొత్తం 149 డివిజన్లలో పోలింగ్ జరిగింది. అక్కడక్కడా చిన్న చిన్న ఘర్షణలు మినహా ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. పట్టణంతో పోలిస్తే శివారు ప్రాంతాల్లోనే పోలింగ్ ఎక్కువగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఆర్సీపురం , పటాన్చెరు, అంబర్పేట సర్కిళ్లలో భారీ పోలింగ్ నమోదైంది. మలక్పేట ,కార్వాన్ పరిధిలో అతి తక్కువగా పోలింగ్ జరిగినట్లు ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. సాయంత్రం ఐదు గంటలకు జరిగిన పోలింగ్ మొత్తం 45.97 పోలింగ్ శాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 45.27 శాతం పోలింగ్ నమోదైంది.గతంతో పోలిస్తే ఈసారి స్వల్పంగా పోలింగ్ శాతం పెరిగింది. అయితే 400 ఏళ్ల చరిత్ర గల భాగ్యనగరానికి ఇంత తక్కువగా ఓటింగ్ నమోదు కావడం ఇది సిగ్గు చేటని విశ్లేషకులు అంటున్నారు. బల్ధియా పోలింగ్ పై వరుస సెలవులు ప్రభావం చూపాయని పలువురు చర్చించుకుంటున్నారు. గ్రేటర్ ఎన్నికల పరిధిలోని ఓల్డ్ మలక్పేటలో రీ పోలింగ్ నిర్వహించనున్నట్లు , రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ పార్థసారధి చెప్పారు. డివిజన్లోని పోలింగ్ నమూనా బ్యాలెట్లో పత్రంలో సీపీఐ కంకికొడవలి గుర్తుకు బదులు సీపీఎం గుర్తు సుత్తె కొడవలి గుర్తును ప్రింట్ చేశారు. అయితే ఇది గమనించిన సీపీఐ పార్టీ నాయకులు ఎలక్షన్ కమిషన్కు ఫిర్యదు చేశారు. దీంతో స్పందించిన ఎలక్షన్ కమిషన్ మలక్ పేట్ డివిజన్ బ్యాలెట్ వ్యవహారంలో ప్రింటింగ్ ప్రెస్ లో సింబల్ ప్రింట్ తప్పు పడిందని వివరించారు. ఇక్కడ ఈ నెల మూడో తేదీన రీపోలింగ్ నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.