డిసెంబర్ 15 నుంచి ఆర్ఆర్బీ పరీక్షలు

డిసెంబర్ 15 నుంచి ఆర్ఆర్బీ పరీక్షలున్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రేపటి నుంచి ఆర్ఆర్బీ(RRB) పరీక్షలు ప్రారంభంకానున్నాయి. మొదటి విడుతలో భాగంగా మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 15 నుంచి 18 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఇందులో టీచర్, స్టెనోగ్రాఫర్ వంటి పోస్టులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో కంప్యూటర్ ఆధారితంగా ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు 1663 పోస్టులకుగాను 1,02,940 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. ఆర్ఆర్ బీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ (ఎన్టీపీసీ) పోస్టులకు సంబంధించిన పరీక్షలు రెండో విడుతలో జరుగనున్నాయి. ఈ నెల 28 నుంచి వచ్చే యేడాది మార్చి వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 35,208 పోస్టులకు గానూ 1,26,30,885 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు.