కార్మికుల మహా ప్రదర్శనకు TUWJ మద్దతు
వరంగల్ టైమ్స్, హైదరాబాద్: దేశంలో బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గురువారం జరిగిన దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా, హైదరాబాద్ లో కార్మిక సంఘాలు నిర్వహించిన మహా ప్రదర్శనకు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(TUWJ) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఆర్టీసి కల్యాణ మండపం నుండి ఇందిరా పార్కు వరకు కొనసాగిన ప్రదర్శనలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కె.విరాహత్ అలీ కార్మిక సంఘాలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుకూల విధానాలను అనుసరిస్తూ, కార్మిక, కర్షక వర్గాలకు తీరని ద్రోహం తలపెట్టడం విచారకరమన్నారు. మోడీ సర్కారు తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేసారు. కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన 29 చట్టాల్లో రెండు వర్కింగ్ జర్నలిస్టుల చట్టాలు రద్దయ్యాయని, ఇది జర్నలిస్టులకు తీరని ద్రోహం చేయడమేనని విరాహత్ ఆందోళన వ్యక్తం చేసారు. ఇవ్వాళ జరిగిన మహా ప్రదర్శనలో 20 ప్రధాన కార్మిక సంఘాలకు చెందిన వేలాది మంది కార్మికులు పాల్గొన్నారు.












