హైదరాబాద్‌లో ఎగిరేది గులాబీ జెండానే: కేటీఆర్

హైదరాబాద్‌లో ఎగిరేది గులాబీ జెండానే: కేటీఆర్ ధీమా

-ఎమ్మెల్యేలు వెళ్లినా క్యాడర్ అంతా కేసీఆర్ వెంటే
-శేరిలింగంపల్లిలో పార్టీ అత్యంత బలోపేతం
-కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధం
-బీఆర్ఎస్‌లోకి భారీ.గా చేరికలుహైదరాబాద్‌లో ఎగిరేది గులాబీ జెండానే: కేటీఆర్వరంగల్ టైమ్స్,హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఒకటి కాదు, ఎన్ని కార్పొరేషన్లు చేసినా ఎగిరేది మాత్రం ఖచ్చితంగా గులాబీ జెండానేనని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన యువ నాయకుడు విజయ్ కుమార్ రెడ్డి తన అనుచరులతో కలిసి గురువారం తెలంగాణ భవన్‌లో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే పార్టీని వీడినా, కార్యకర్తలు మాత్రం చెక్కుచెదరకుండా కేసీఆర్ నాయకత్వంలోనే ఉన్నారని కేటీఆర్ ప్రశంసించారు. “మొత్తం హైదరాబాద్‌లోనే శేరిలింగంపల్లి నియోజకవర్గం పార్టీకి నంబర్ వన్ కోటగా నిలిచింది. స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు వెళ్లినా, బంగారం వంటి కొత్త నాయకులు వందల సంఖ్యలో పార్టీలో చేరుతున్నారు. శేరిలింగంపల్లిలోని 24 డివిజన్లలో క్లీన్ స్వీప్ చేసే సత్తా మనకుంది” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలతో అరిచేతుల వైకుంఠం చూపి అధికారం దక్కించుకుందని కేటీఆర్ విమర్శించారు. మరోవైపు బీజేపీ 12 ఏళ్లుగా తెలంగాణకు 12 పైసల పని కూడా చేయలేదని, అది ‘పూజకు పనికిరాని పువ్వు’ అని ఎద్దేవా చేశారు. “వెట్టి పనికైనా, మట్టి పనికైనా మనోడే ఉండాలి” అన్న నానుడిని గుర్తు చేస్తూ, తెలంగాణకు కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని ఆయన పేర్కొన్నారు.

-నగరంలో కుప్పకూలిన శాంతిభద్రతలు: కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతింటోందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. పట్టపగలే సుల్తాన్ బజార్ ఎస్‌బీఐ బ్రాంచ్‌లో దోపిడీలు, చందానగర్‌లో జ్యువెలరీ షాపులపై దాడులు, హత్యలు జరుగుతున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో వ్యాపారాలు, వాణిజ్య సంస్థలు కుదేలయ్యాయని, కొత్త కొలువులు రాకపోగా ఉన్నవి పోయే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు.

-డివిజన్ల వారీగా మీటింగులు: త్వరలో రాబోయే కార్పొరేషన్ ఎన్నికల కోసం డివిజన్ల వారీగా సమావేశాలు నిర్వహించి పార్టీని మరింత పటిష్టం చేస్తామన్నారు. “ఎమ్మెల్యే లేడని భయపడకండి, మీకు అండగా నేను, తలసాని శ్రీనివాస్ యాదవ్, అరికెపూడి కృష్ణారావు ఉంటాం. ఏ అవసరమొచ్చినా మేము అందుబాటులో ఉంటాం” అని హామీ ఇచ్చారు.తప్పుడు ఓటు వేస్తే ఐదేళ్ల పాటు శిక్ష అనుభవించాల్సి వస్తుందని, ఓటు వేసే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ముఖ్యంగా మహిళా లోకానికి కేటీఆర్ విన్నవించారు. చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావడం శుభపరిణామమని, విజయ్ కుమార్ రెడ్డి వంటి యువకులు పార్టీకి ఆస్తి అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు , నేతలు పాల్గొన్నారు.