అశోకా బిల్డర్స్ వ్యవస్థాపకుడు మృతి
వరంగల్ టైమ్స్, హైదరాబాద్: అశోకా బిల్డర్స్ వ్యవస్థాపకుడు ఎన్. జైవీర్ రెడ్డి ఆదివారం రాత్రి 9.06 గంటలకు గుండెపోటుతో మరణించారు. ఆయన మరణవార్త విని హైదరాబాద్ నిర్మాణ రంగమంతా దిగ్భ్రాంతి చెందింది. స్వతహాగా సివిల్ ఇంజినీరైన జైవీర్ రెడ్డి భాగ్యనగరంలో అశోకా బిల్డర్స్ను స్థాపించడంతో పాటు అనేక ప్రాజెక్టుల్ని విజయవంతంగా పూర్తి చేశారు. గతంలో ఆయన క్రెడాయ్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీగా వ్యవహరించారు. జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ క్లబ్ ఉపాధ్యక్షుడిగా సేవలు అందించారు. ప్రస్తుతం కేబీఆర్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. హైదరాబాద్ నిర్మాణ రంగాన్ని గతిని మార్చేసిన జీవో నెం. 86 రూపొందించడంలో ఆయన ప్రత్యేకంగా కృషి చేశారు. రియల్ పరిశ్రమను గాడిలో పెట్టే అనేక నిర్ణయాల్ని తీసుకోవడంలో ముఖ్యభూమిక పోషించారు. ప్రస్తుతం ఆయన కుమారుడు జైదీప్ రెడ్డి అశోకా బిల్డర్స్ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు.ఈ సందర్భంగా క్రెడాయ్ నేషనల్ మాజీ అధ్యక్షుడు సి.శేఖర్ రెడ్డి, జైవీర్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్ నిర్మాణ రంగం ఒక పెద్ద దిక్కును కోల్పోయినందుకు క్రెడాయ్ నేషనల్ ఉపాధ్యక్షుడు గుమ్మి రాంరెడ్డి విచారం వ్యక్తం చేశారు. క్రెడాయ్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ట్రెడా సంఘం అధ్యక్షుడు చలపతిరావు ఆయన హఠాన్మరణం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబసభ్యులకు సంతాపాన్ని తెలియజేశారు. జైవీర్ రెడ్డి మరణం నిర్మాణ రంగానికి తీరని లోటు అని టీబీఎఫ్ అధ్యక్షుడు ప్రభాకర్ రావు తెలిపారు. హైదరాబాద్ నిర్మాణ రంగం అభివృద్ధిలో ఆయన పాత్ర అమోఘమైనదని నరెడ్కో తెలంగాణ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ప్రేమ్ కుమార్ అన్నారు.