టీఎస్పీఎస్సీపై కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష 

టీఎస్పీఎస్సీపై కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష

warangaltimes, హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో టీఎస్పీఎస్సీ అంశంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి తో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు. పేపర్ లీకేజీ, పరీక్షల నిర్వహణ, తదుపరి కార్యాచరణపై చర్చిస్తున్నారు.

పేపర్ లీకేజీ అంశంతో ఇప్పటికే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను టీఎస్పీఎస్సీ రద్దు చేసింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ తో పాటు ఏఈఈ, డీఏవో పరీక్షలను కూడా రద్దు చేసిన విషయం తెలిసిందే. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను ఈ యేడాది జూన్ 11న మళ్లీ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ప్రశ్నాప్రత్నాల లీకేజీల దృష్ట్యా టీఎస్పీఎస్సీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

ఇప్పటికే ఏఈ, టీపీబీవో, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. గ్రూప్-1 ప్రిలిమ్స్ ను గత సంవత్సరం అక్టోబర్ 16న నిర్వహించగా, ఏఈఈ పరీక్షను ఈ యేడాది జనవరి 22న , డీఏవో పరీక్షను ఫిబ్రవరి 26న నిర్వహించారు. నేడు ఉదయం టీఎస్పీఎస్సీ సమావేశమై ప్రస్తుత పరిణామాలపై చర్చించింది. సిట్ నివేదిక, అంతర్గత విచారణను పరిగణనలోకి తీసుకున్న తర్వాత గ్రూప్-1, ఏఈఈ, డీఏవో పరీక్షలను రద్దు చేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది.