నా కుటుంబం ఆపదలో ఉంది: పూరి జగన్నాధ్
వరంగల్ టైమ్స్, హైదరాబాద్: జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో దర్శకుడు పూరి జగన్నాధ్ పోలీసులను ఆశ్రయించారు. డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను, ఫైనాన్సియర్ శోభన్లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై, తన కుటుంబంపై హింసకు పాల్పడేలా వీరు ఇతరులను ప్రేరేపిస్తున్నట్లు కంప్లైంట్లో పేర్కొన్నారు. వారి నుంచి తనకు, తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. వరంగల్ శ్రీను, ఫైనాన్సియర్ శోభన్లపై కఠిన చర్యలు తీసుకోవాలని పూరి జగన్నాధ్ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కిన లైగర్ సినిమా ఫ్లాప్ పూరి జగన్నాథ్కు కొత్త చిక్కులు తెచ్చి పెట్టింది. భారీ స్థాయిలో నష్టాలు రావడంతో డిస్ట్రిబ్యూటర్స్ తమకు కొంత డబ్బు వెనక్కు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీని కోసం పూరి ఒక నెల రోజులు గడువు కోరినప్పటికీ కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం దర్శకుడి ఆఫీస్ ముందు ధర్నా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలిసిన పూరి జగన్నాథ్ తన పరువు తీయాలని చూస్తే మాత్రం ఒక్క పైసా కూడా ఇవ్వనని వార్నింగ్ ఇచ్చాడు. ఈమేరకు ఓ ఆడియోకాల్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తాజాగా పూరి జగన్నాధ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివాదం మరింత ముదురుతోంది…!!