న్యూఢిల్లీ: జేఈఈ మెయిన్ 2021 షెడ్యూల్ను కేంద్రం విడుదల చేసింది. కేంద్ర మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిషాంక్ షెడ్యూల్ వివరాలను వెల్లడించారు. 2021లో మొత్తం నాలుగు దశల్లో జేఈఈ మెయిన్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. మొదటి దశ పరీక్షలను ఫిబ్రవరిలో, రెండో దశ మార్చిలో, మూడో దశ ఏప్రిల్లో, నాలుగో దశ మే నెలలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. మొదటి దశ ఎగ్జామ్స్ తేదీలను కూడా మంత్రి వెల్లడించారు. ఫిబ్రవరి 23 నుంచి26 వరకు నాలుగు రోజులపాటు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఆఖరి పరీక్ష తర్వాత నాలుగైదు రోజుల్లోనే రిజల్ట్స్ ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. 2021లో జరుగునున్న జేఈఈ మెయిన్ పరీక్షల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పలు మార్పులు చేసింది. గతంలో రెండు దశల్లో నిర్వహించిన ఈ పరీక్షలను ఇప్పుడు నాలుగు దశలకు పెంచింది. అలాగే ప్రశ్నాపత్రంలో ప్రాంతీయ భాషలను కూడా చేర్చింది. కరోనా వైరస్ దృష్ట్యా పరీక్ష సెంటర్ల సంఖ్యను పెంచుతూ షెడ్యూల్ వెల్లడించింది.