యాదాద్రి: తన పుట్టిన రోజుని పురస్కరించుకుని, యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహ స్వామి వారిని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కుటుంబ సభ్యులతో కలిసి శనివారం సాయంత్రం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు మంత్రికి పూర్ణ కుంభ స్వాగతం పలికారు. మంత్రి ప్రధాన గర్భగుడిలో దేవుడిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు మంత్రి ఎర్రబెల్లికి పట్టు వస్త్రాలు అందించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తమ ఇల వేల్పు అయిన యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహ స్వామి వారిని తరచూ దర్శించుకుంటామని చెప్పారు. ఈ రోజు తన పుట్టిన రోజు కావడంతో ప్రత్యేకంగా యాదాద్రికి వచ్చినట్లు తెలిపారు. సిఎం కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు.