చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త పార్టీ పనులను వేగవంతం చేశారు. రజనీకాంత్ కొత్తపార్టీ పేరు‘మక్కల్సేవై కర్చీ (ప్రజాసేవపార్టీ) అనే పేరు ఖరారైంది. అలాగే పార్టీకి ఆటో గుర్తును ఎలక్షన్ కమిషన్ ఖరారు చేసింది. రజనీకాంత్ తాను నటించిన భాషా సినిమాలో ఆటో డ్రైవర్గా కనిపించారు. ఈ చిత్రంతో రజనీకి దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు వచ్చింది. ఈ ఆటోను తన ఎన్నికల గుర్తుగా మార్చుకోవాలని ఫ్యాన్స్ సూపర్స్టార్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ ఆటో సింబలే మీకు, మీ పార్టీకి కరెక్టు సూట్ అవుతుందని రజనీకాంత్ కు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన తన ఎన్నికల గుర్తుగా ఆటోను ఎంపికచేసుకున్నారు. రజనీకాంత్ ఎంపిక చేసుకున్న ఆ బొమ్మ గుర్తు గురించి తెలుసుకుందాం. ఆ గుర్తు ఎలా ఉందంటే పసుపు కలర్ ఆటో, ఆటో ముందు బజాజ్ కంపెనీ పేరుకు బదులుగా బాద్షా అనే పేరుతో ఉంది. ఆటోలో నుంచి రజినీకాంత్ వంగి చూసి తన యూనిఫామ్ కాలర్ తన వేలితో పట్టి ఎగరవేసే ఫోటోతో ఆ గుర్తు ఉంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇదే బొమ్మను తన పార్టీ గుర్తుగా ఏర్పాటు చేసుకోవాలని అభిమానులు మరియు సోషల్మీడియాలో నెటిజన్లు బలంగా కోరడంతో రజినీకాంత్ ఇదే గుర్తును తన పార్టీ గుర్తుగా ఎంపిక చేయాలని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆలోచించిన ఎన్నికల కమిషన్ మధ్యాహ్నం సమయంలో ఆ గుర్తును ఖరారు చేసింది. అభిమానుల అనుకున్న గుర్తే ఈసీ ఖరారు చేయడంతో తలైవా అభిమానులు సంబురాలు జరుపుకుంటున్నారు. తమిళనాడులోని 234 నియోజకవర్గాల్లో రజనీకాంత్ పార్టీ ‘మక్కల్సేవై కర్చీ’పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గతంలో రజనీ ‘బాబా లోగోను కోరగా.. దాన్ని కేటాయించేందుకు ఎన్నికల సంఘం తిరస్కరించింది. ఇదిలా ఉంటే పార్టీ జెండా ఇతర విషయాలను ఈ నెలాఖరున రజనీకాంత్ స్వయంగా వెల్లడించనున్నారు.