డాక్టర్ రమేష్ బాబు విచారణకు హైకోర్టు ఓకే..ఆయన లాయర్ సమక్షంలోనే విచారించాలి
ఏపి: స్వర్ణ ప్యాలెస్ హోటల్లో జరిగిన అగ్నిప్రమాదం కేసులో రమేష్ ఆసుపత్రి ఎండీ డాక్టర్ పి.రమేష్బాబు కస్టోడియల్ విచారణకు అనుమతిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. కోవిడ్ కేర్ సెంటర్ పేరుతో ఆయన నిర్వహించిన ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగి 10 మంది చనిపోయారు. తరువాత ఆయన పరార్ అయ్యాడు. అనంతరం హైకోర్టు ఆయనపై కేసు విచారణను నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. విచారణను అడ్డుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. దీంతో పోలీసులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 30వ తేదీ నుంచి డిసెంబరు 2వ తేదీ వరకూ వరుసగా మూడు రోజుల పాటు అదనపు డీసీపీ ఎదుట హాజరుకావాలని రమేష్బాబుకు సూచించింది. ఆయా తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ అదనపు డీసీపీ కార్యాలయంలో విచారణ జరుగుతుందని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ సీహెచ్.మానవేంద్రనాథ్రాయ్ శుక్రవారం ఆదేశాలు జారీచేశారు. రమేష్బాబు తరఫు న్యాయవాది సమక్షంలో ఈ విచారణ జరపాలని అందులో వివరించారు.