తెలంగాణ రైతాంగంపై కేంద్రం వివక్ష
యాసంగిలో పంట ధాన్యాలను కేంద్రమే కొనుగోలు చేయాలి
కక్ష పూరితంగానే కేంద్రం ధాన్యం కొనుగోలు చేయడం లేదు
కేంద్ర, బీజేపీ రైతు వ్యతిరేక విధానాలపై టీఆర్ఎస్ మండిపాటు
కేంద్రం వరి ధాన్యం కొనుగోలు చేసే వరకు పోరాటం ఆగదు
భారీ సంఖ్యలో పాల్గొన్న రైతులు, పార్టీ శ్రేణులు
ప్రతీ నియోజకవర్గంలో వెల్లువెత్తిన నిరసనలు
ఎడ్ల బండ్లు ఎక్కి నిరసన తెల్పిన మంత్రి, చీఫ్ విప్
ఉమ్మడి వరంగల్ : రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ సీఎం కేసీఆర్ పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రజలంతా రైతాంగానికి అండగా నిలువాలని, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర రైతుల యాసంగి పంటలు మొత్తం కొనుగోలు చేసే వరకు ఆందోళనలు ఆపొద్దని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తిలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, రైతులతో కలిసి మంత్రి చౌరస్తాలో ధర్నా చేశారు.
అనంతరం వర్ధన్నపేటలో ఎమ్మెల్సీ, రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే అరూరీ రమేశ్, వరంగల్ ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ మార్నే ని రవీందర్ రావు, తదితరులతో కలిసి రైతుల ధర్నా లో పాల్గొన్నారు. ఆ తర్వాత హనుమకొండ జిల్లాలోని వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని ఆచార్య జయశంకర్ ఏకశిలా పార్కులో పెద్ద ఎత్తున నిర్వహించిన ధర్నాలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, రైతు రుణ విముక్తి సంస్థ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, దివ్యాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవ రెడ్డి లతో కలిసి ధారణలో మంత్రి ఎర్రబెల్లి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయా ధర్నా కార్యక్రమాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడారు. సమైక్య రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన వ్యవసాయ రంగం అభివృద్దికి సీఎం కేసిఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అభివృద్ది, సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్దిని అందరూ ఒకసారి విశ్లేషించుకోవాలని గుర్తుచేశారు.
నాటి పాలకుల నిర్లక్ష్యంతో బాబ్లీ వంటి ప్రాజెక్ట్ ల నిర్మాణంతో ప్రధాన వనరుగా ఉన్న ఎస్సారెస్పీకి చుక్కనీరు రాకుండా పోయింది. కాకతీయ కాలువ శిథిలావస్థకు చేరింది. ఉత్తర తెలంగాణకు సాగునీరు కరువైంది. రైతుల కష్టాలు, వ్యవసాయం గురించి తెలిసిన నాయకుడు మనకు ముఖ్యమంత్రిగా ఉండటంతో అనతికాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ను నిర్మించి, పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్ట్లను పూర్తి చేసి సమృద్ధిగా సాగు నీరు అందించారు. మిషన్ కాకతీయ పథకం ద్వారా పూడి పోయిన చెరువులను అభివృద్ది చేసినారు. దీంతో తెలంగాణ కోటి ఎకరాల మాగణ గా మారింది.హనుమకొండ జిల్లాలో పశ్చిమ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో హనుమకొండ చౌరస్తా నుండి జయశంకర్ స్మృతి వనం వరకు ఎడ్లబండ్లతో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. జయశంకర్ స్మృతి వనం ఎదుట ధర్నా చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతుల కోసం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించినందుకే తెలంగాణ పై బీజేపి కక్ష కట్టిందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే , ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.
కేంద్రంలోని బీజేపీ తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు, రైతులకు శాపాలుగా మారాయని అన్నారు. బీజేపి నాయకులకు దమ్ముంటే మీరు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన చట్టాల్లోని అంశాలను రైతులకు బహిరంగంగా వివరించాలని ప్రభుత్వ చీఫ్ విప్ డిమాండ్ చేశారు. కేంద్రం తెచ్చిన చట్టాలలో ఉన్న విషయం బయటపడిన రోజు బీజేపీ జెండా పట్టినోళ్లను ప్రజలు ఉరికిస్తారని బీజేపీ కేంద్ర, రాష్ట్ర నాయకులను ఆయన హెచ్చరించారు.
ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు, పార్టీ శ్రేణులు నినాదాలతో హోరెతించారు. ఈ కార్యక్రమాల్లో రైతులు, ఎంపిపిలు, జడ్పిటిసిలు, రైతు బంధు సమితి కోఆర్డినేటర్లు, పీఏసీఎస్ చైర్మన్లు, మండల పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్లు, ఎంపిటిసిలు, సర్పంచులు, కౌన్సిలర్లు, గ్రామ పార్టీ అధ్యక్షులు, టీఆరెఎస్ పార్టీ అనుబంధ సంఘాలు, ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..