భారత్ లో 5జీ సేవల విస్తరణకు కసరత్తు
వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : భారత్ లో 5జీ సర్వీసులు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే 5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు అత్యంత వేగంగా నగరాలు, పట్టణాలకు విస్తరిస్తున్నాయి. అక్టోబర్ 1న 5జీ సేవలు లాంఛ్ అయ్యాయి. ఆ తర్వాత డిసెంబర్ 7 వరకు 50 నగరాలకు తమ కవరేజ్ ను టెలికాం ఆపరేటర్లు విస్తరించారు.
ఎయిర్ టెల్, రిలయన్స్ జియో ప్రస్తుతం భారత్ లో 5 జీ సేవలను అందిస్తుంది. ఇందులో భాగంగానే 2024 వరకు 5జీ సేవలను భారతదేశ వ్యాప్తంగా విస్తరించేందుకు సన్నాహాలు చేపట్టాయి. 2023 డిసెంబర్ నాటికి భారత్ లోని అన్ని నగరాలు, ముఖ్యపట్టణాలకు 5జీని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రిలయన్స్ జియో కసరత్తు ప్రారంభించింది.
ఇప్పటి వరకు భారత్ లోని 50 నగరాలకు 5 జీ సేవలను విస్తరించామని కేంద్ర టెలికాం మంత్రి అశ్వేని వైష్ణవ్ పార్లమెంట్ వేదికగా వెల్లడించారు. రెండు నెలల్లో 50 నగరాలకు 5జీ సేవలు విస్తరించాయని తెలిపారు. టెలికాం ఆపరేటర్లు 5జీ మొబైల్స్ లలో ఎలాంటి టారిఫ్ పెంపు లేకుండా 5 జీ కనెక్టివిటీని ఆఫర్ చేస్తున్నారని చెప్పారు. 5జీ సేవలను అక్టోబర్ 1న ప్రారంభించగా వెనువెంటనే దేశవ్యాప్తంగా 12 నగరాల్లో హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి.