హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ మందకోడిగా సాగుతోంది. పోలింగ్ ప్రారంభమై 2 గంటలు గడుస్తున్నా జనాలు బయటికి రావడం లేదు. పాతబస్తీలో పోలింగ్ బూత్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఐటీ కారిడార్లో ఓటేసేందుకు టెకీలు ముందుకు రావడం లేదు. మరోవైపు పలు చోట్ల బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంటోంది. హఫీజ్పేట్ మాధవనగర్లో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. బీజేపీ అభ్యర్థి రాధాకృష్ణ యాదవ్.. టీఆర్ఎస్ బ్యానర్లను చించేశారు. టీఆర్ఎస్ నేతలు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కాగా.. బంజారాహిల్స్ డివిజన్లో బీజేపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. కాషాయ మాస్క్లు ధరించిన పోలింగ్ ఏజెంట్లు, ఓటర్లను.. పోలింగ్ సిబ్బంది లోనికి అనుమతించడం లేదంటూ ఆందోళనకు దిగారు.