బంద్కు సంపూర్ణ మద్దతు
కేంద్రం మొండి వైఖరి వీడాలి
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
వరంగల్ అర్బన్జిల్లా: భారత్బంద్కు టీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుపడినట్లు చరిత్రలో లేదన్నారు. తెలంగాణలో దండగ అన్న వ్యవసాయన్ని సీఎం కేసీఆర్ పండుగలా చేస్తున్నారని కొనియాడారు. ఆదివారం హన్మకొండలోని ఆర్అండ్బీ అతిథి గృహంలోని తన కార్యాలయంలో ఎంపీలు బండ ప్రకాశ్, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్యే అరూరి రమేశ్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. దేశ వ్యాప్తంగా 12 రోజులుగా రైతులు చలిని సైతం లెక్క చేయకుండా దీక్షలు చేస్తున్నారని అన్నారు. వారికి మద్దతుగా నిలవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని తెలిపారు. పార్టీ నిర్ణయం, సీఎం కేసీఆర్ ఆదేశానుసారం కేంద్రం మొండి వైఖరికి నిరసనగా దేశ వ్యాప్తంగా ఈ నెల 8న రైతాంగం నిర్వహిస్తున్న బంద్ కు టీఆర్ఎస్ మద్దతు ప్రకటించిందన్నారు. బంద్ లో ప్రత్యక్షంగా పార్టీ శ్రేణులు పాల్గొంటాయని పేర్కొన్నారు. అన్నం పెట్టే రైతన్నను రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్ని విధాలుగా ఆదుకుంటున్నారని తెలిపారు. కానీ దేశంలో పీఎం మోడీ రైతు వ్యతిరేక చట్టాలు తీసుకువచ్చి రైతులకు సున్నం పెట్టే పనులకు శ్రీకారం చుట్టారన్నారు. దేశంలో నూటికి 70 శాతం ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు. కొద్ది మంది పెట్టుబడిదారుల కోసం కేంద్రం ఒడిగట్టిందని మంత్రి విమర్శించారు. రైతులకు అండగా ప్రజలు, వ్యాపారులు నిలిచి బంద్లో పాల్గనాలని మంత్రి ఎర్రబెల్లి విజ్ఞప్తి చేశారు.