‘యాప్​’ల రుణాలు నమ్మొద్దు : డీజీపీ

‘యాప్​’ల రుణాలు నమ్మొద్దు : డీజీపీ

హైదరాబాద్ : ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో గాని లేదా ఏవిధమైన బ్యాంకు నుంచి గాని రుణాలు అందించేవారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలు కచ్చితంగా వర్తిస్తాయని డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఇటీవల రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో యాప్ ల ద్వారా అనేకమందికి నగదు రుణాలు అందించి వాటిని తిరిగి చెల్లించే క్రమంలో చేసిన వేధింపులను భరించలేక పలువురు ఆత్మహత్యలకు పాల్పడ్డ సంఘటనలు జరిగాయి. ఈ సంఘటనలపై డీజీపీ మహేందర్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆర్బీఐ చట్టం 1934 లోని సెక్షన్ 45-1A ప్రకారం ఏదైన నాన్ బ్యాకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు తగిన రిజిస్ట్రేషన్ అనంతరమే నిబంధనల మేరకు పనిచేయడానికి అనుమతి ఉందని తెలిపారు. ఆర్బీఐ చట్టానికి లోబడి రిజిస్టర్ కాని ఏ నాన్ బ్యాకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు చట్టబద్దత లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం చలామణిలో ఉన్న ఈ ఆన్ లైన్ యాప్ లలో అధికశాతం ఆర్బీఐలో నమోదు కాలేదని అందువల్ల వారికి రుణాలు అందించే అధికారంలేదని పేర్కొన్నారు. ఈ యాప్ లలో అధికంగా చైనీస్ వే ఉన్నాయని, వాటికి రిజిస్టర్ అయిన చిరునామా గాని, సరైన మొబైల్ నెంబర్ గాని ఇతర వివరాలు ఉండవని తెలిపారు. ఫోన్ ద్వారానే సమాచారాన్ని (డేటా) ను యాప్ ల నిర్వాహకులు తెలుసుకుంటారని అన్నారు. ఈ యాప్ ల యూజర్లు లిఖితపూర్వకంగా లేని రూపంలో తమ కాంటాక్ట్ నెంబర్లు, ఫోటోలు, వీడియోలు, సోషల్ మీడియా సమాచారం ఇతర వ్యక్తిగత సున్నిత అంశాలను తమకు తెలియకుండానే అందిస్తారు. యాప్ ల ద్వారా తీసుకున్న రుణాలను చెల్లించని బాధితులను వేధించేందుకు ఈ సమాచారాన్ని రుణాలు అందించే యాప్ ల నిర్వాహకులు దుర్వినియోగం చేస్తారని అన్నారు. ఈ నేపథ్యంలో రుణాలు స్వీకరించే సమయంలో ఏవిధమైన షరతులకు అంగీకరించవద్దని, ముఖ్యంగా మీ వ్యక్తిగత వివరాలు, ఆధార్, బ్యాంకు వివరాలను ఎట్టి పరిస్థితుల్లో అందజేయవద్దని ప్రజలకు సూచించారు.. ఇంటర్ నెట్ లో లభించే పలు రుణాలు అందించే యాప్ లు మోసపూరితమైనవని ఆర్బీఐ గుర్తింపులేని ఈ యాప్ ల ద్వారా రుణ ఆధారిత దరఖాస్తులను డౌన్ లోడ్ చేయకూడదని పేర్కొన్నారు. ఈ యాప్ ల ద్వారా అందించే రుణాల వడ్డీ రేట్లు రోజుకు ఒక శాతం వరకు ఉంటాయన్నారు. ఇది సాధారణంగా బ్యాంకులు లేదా ఎన్.బి.ఎఫ్.సి రిజిస్టర్ అయిన సంస్థలు అందించే రుణ వడ్డీలకన్నా అత్యధికమని తెలిపారు. రుణ బాధితులు సకాలంలో చెల్లించని పరిస్థితిలో ఈ వడ్డీ మొత్తం రెట్టింపు లేదా మూడొంతులై రుణవలయంలో చిక్కుకుంటారని చెప్పారు. దీంతో రుణాలు చెల్లించని రుణగ్రహీతలను తిరిగి చెల్లించమని బెదిరించడం, బ్లాక్ మెయిల్ చేయడంతో పాటు ఆన్ లైన్ వేధింపులకు ఈ యాప్ లు పాల్పడుతాయని వివరించారు.. ‘రుణాలను చెల్లించనట్లైతే మీ పై క్రిమినల్ కేసులు బుక్ చేయడం జరుగుతుందని’ రుణం అందించే యాప్ లు బెదిరించే అవకాశం ఉందన్నారు. ఈ పరిస్థితులు ఎదురైతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని డీజీపీ కోరారు. ఆర్బీఐలో రిజిస్టర్ కాని, అక్రమ యాప్ ల ద్వారా ఏవిధమైన రుణాలు స్వీకరించవద్దని ప్రజలకు సూచించారు.. ఈ విషయంలో ఎవరైన వేధింపులకు గురయితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని డీజపీ ప్రకటనలో పేర్కొన్నారు.