వరంగల్ అర్బన్ : ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ వెంకటేశ్వర్లు హిజ్రాలను హెచ్చరించారు. నగరంలో హిజ్రాల ద్వారా ఎదురవుతున్న సమస్యలపై పలు ఫిర్యాదులు అందడంతో వరంగల్ ఏసీబీ గిరికుమార్ ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు ఆదివారం వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. నగరంలోని ప్రధాన హిజ్రా గ్రూపులకు నిర్వహించిన ఈ కౌన్సెలింగ్ లో ఆయన మాట్లాడారు. ప్రధానంగా ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రధాన కూడళ్లలో ఆగివున్న వాహనదారులను ఇబ్బందులకు గురిచేసే విధంగా భిక్షాటన చేయడంతో పాటు రైల్వే , బస్టాండ్ వద్ద ప్రయాణికులను డబ్బు కోసం అసభ్యకరంగా ప్రవరిస్తూ వారిపై భౌతిక దాడులకు పాల్పడుతున్నట్లుగా పలు ఫిర్యాదు అందాయన్నారు. ప్రజల పట్ల మర్యాదగా వ్యవహరించాలన్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యలు తలత్తే విధంగా కూడళ్లలో భిక్షాటన చేయొద్దన్నారు. ఇకపై ప్రజల నుంచి ఏలాంటి ఫిర్యాదులు వచ్చిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.