చైతన్యంతోనే ఎన్ఆర్ఐ మోసాలకు చెక్

చైతన్యంతోనే ఎన్ఆర్ఐ మోసాలకు చెక్హైదరాబాద్: ఉత్తరాది రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, ఢిల్లీల అనంతరం దక్షణాది రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణాలలో ఎన్.ఆర్.ఐ వివాహ సంబంధిత మోసాల కేసులు అధికంగా ఉన్నాయని జాతీయ మహిళా కమీషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రవాస భారతీయుల వివాహాలకు సంబంధించిన మోసాలపై మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలను ఎదుర్కోవాలంటే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ఆమె సూచించారు.

ఇందులో భాగంగానే జాతీయ మహిళా కమీషన్, తెలంగాణా పోలీస్ మహిళా భద్రతా విభాగం సంయుక్తంగా నిర్వహించిన న్యాయ సంబంధిత చట్టాలపై అవగాహన సదస్సుకు రేఖా శర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బేగంపేట టూరిజం ప్లాజా లో ఏర్పాటు చేసిన సదస్సుకు రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు సునీతా లక్ష్మారెడ్డి, తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటీ మెంబర్ సెక్రెటరీ ఎం.వి రమేష్, మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీజీ స్వాతి లక్రా, డీఐజీ సుమతి, ప్రాంతీయ పాస్ పోర్ట్ అధికారి బాలయ్యలు హాజరయ్యారు.

డీఐజీ సుమతి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో రేఖా శర్మ మాట్లాడారు. జాతీయ మహిళా కమీషన్ వద్ద ఎన్.ఆర్.ఐ. వివాహాలకు సంబంధించి 5 ,858 కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఈ కేసుల పరిష్కారానికి వివిధ దేశాలకు చెందిన పలు ఏజెన్సీలు, మన దేశంలోని వివిధ సంస్థల సమన్వయంతో పనిచేయాల్సి ఉన్నందున, పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.

ఈవిధమైన గృహ సంబంధిత నేరాల అదుపుకు, మహిళలు ప్రధానంగా వివాహానికి సిద్ధంగా ఉన్న యువతులను చైతన్య పరచడమే మార్గమని రేఖాశర్మ అభిప్రాయం పడ్డారు. ముఖ్యంగా మహిళా కళాశాలల్లో ఎన్.ఆర్.ఐ వివాహాలకు సంబంధించిన చట్టాలు, జాగ్రత్తలు, జరిగే మోసాల పట్ల అవగాహన కల్పించాలని సూచించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలను పోల్చి చూస్తే తెలంగాణా పోలీస్ శాఖకు చెందిన మహిళా భద్రతా విభాగం సమర్థవంతంగా పనిచేస్తోందని అభినందించారు.

ఎన్.ఆర్.ఐ వివాహ మోసాలకు సంబంధించి రాష్ట్ర మహిళా కమీషన్ కు 15 ఫిర్యాదులు అందాయని రాష్ట్ర మహిళా కమీషన్ చైర్ పర్సన్ సునీతా లక్షా రెడ్డి తెలిపారు. పోలీస్ శాఖకు చెందిన మహిళా భద్రతా విభాగం, లీగల్ సర్వీసెస్ అథారిటీ తదితర సంస్థల సమన్వయంతో మహిళల సమస్యలపై అందే ఫిర్యాదులను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. తెలంగాణా రాష్ట్రంలో ఇప్పటి వరకు 728 ఎన్.ఆర్.ఐ వివాహాలకు సంబంధించిన కేసులు దాఖలయ్యాయని రాష్ట్ర మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీజీ స్వాతి లక్రా వెల్లడించారు.

వీటిలో 678 కేసులు గ్రామీణ పోలీస్ స్టేషన్లలో నమోదైనవేనని తెలిపారు. మహిళా భద్రతా విభాగంలో 2019 నుండి 239 కేసులు నమోదు కాగా 42 కేసులను పరిష్కరించామని, మిగిలినవి వివిధ స్థాయిల్లో ఉన్నాయని వివరించారు. ఎన్.ఆర్.ఐ వివాహ మోసాలకు సంబంధించిన ప్రతీ కేసు భిన్నంగా ఉంటున్నందున వీటి పరిష్కారానికై భాదితులు ఎంతో ఓపికతో వ్యవహరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

ప్రధానంగా అమెరికా,ఆస్ట్రేలియా, బ్రిటన్, సౌదీ అరేబియా, కెనడా దేశాలకు సంబంధించిన కేసులే అధికంగా ఉన్నాయని స్వాతి లక్రా వివరించారు. ఎన్.ఆర్.ఐ వివాహాలకు సంబంధించిన కేసు నమోదయితే ఆయా కేసుకు ప్రత్యేకంగా ఒక అధికారిని కేటాయించి, వివిధ ఏజెన్సీలు, విదేశీ ఎంబసీలతో సమన్వయం చేసి పరిష్కారానికి చర్యలు చేపట్టామని అడిషనల్ డీజీ వివరించారు.

మహిళలకు సంబంధించిన పలు సమస్యల పరిష్కారానికై ప్రత్యేకంగా 18 మహిళా పోలీస్ స్టేషన్లు పనిచేస్తున్నాయని డి.ఐ.జి సుమతి తెలిపారు. మహిళలకు సంబంధించి ప్రవాస భారతీయుల మోసాలపై అందే ఫిర్యాదుల పరిష్కారానికి పోలీస్ శాఖతో పాటు జాతీయ మహిళా కమీషన్, భారత విదేశీ మంత్రిత్వ శాఖ, హోమ్ మంత్రిత్వ శాఖల సమన్వయంతో పని చేస్తున్నామని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా తెలంగాణాలో ఎన్.ఆర్.ఐ సెల్ విభాగం పని తీరు అనే అంశంపై రూపొందించిన పుస్తకాన్ని జాతీయ మహిళా కమీషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ ఆవిష్కరించారు. ఈ సదస్సులో హైదరాబాద్ లోని వివిధ దేశాలకు సంబంధించిన కన్సొలేట్ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.