ప్రశాంత్ కిషోర్ సంచలన నిర్ణయం
సొంతంగా పార్టీ పెడుతున్నట్లు ప్రకటన
జన్ సురాజ్గా నామకరణం
వరంగల్ టైమ్స్, ఢిల్లీ : ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తన రాజకీయ భవితవ్యానికి సంబంధించి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. దేశంలో కొత్త రాజకీయపార్టీ పెట్టబోతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. పార్టీ పేరును జన్ సురాజ్గా నామకరణం చేసినట్లు వెల్లడించారు. అంతేగాక సొంత రాష్ట్రం బీహార్ నుంచే తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. బెంగాల్ ఎన్నికల తర్వాత వ్యూహకర్త వృత్తిని వదిలేసినట్లు చెప్పిన విషయం తెలిసిందే.తర్వాత ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో చేరేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టడం, ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీతో సుదీర్గ చర్చలు జరపడం కూడా తెలిసిందే. తాను ఆశించినట్లు జరక్కపోవడంతో పీకే.. కాంగ్రెస్ లో చేరిక అంశాన్ని పక్కనపెట్టేశారు. కాగా, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ సొంతగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు స్వయంగా ప్రకటించడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. దేశంలోనే విజయవంతమైన ఎన్నికల వ్యూహకర్తగా పేరు సంపాదించిన ప్రశాంత్ కిషోర్ ప్రత్యక్ష రాజకీయాల్లో ఏ మేరకు సక్సెస్ అవుతారనేది వేచి చూడాల్సిందే.